నల్ల బర్లీ పొగాకు కు గిట్టుబాటు ధర కల్పించాలి

– గత ఏడాది ధరలకు నల్లబర్లీ పొగాకును ప్రభుత్వ రంగ సంస్థలతో వెంటనే కొనుగోలు చేయించాలి
– క్వింటాకు రూ. 15 వేలు మద్దతు ధర ఇవ్వాలి
– పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును తీసుకురావాలి
– బహుళ జాతి సంస్థల ( కార్పొరేట్ సంస్థలు) దోపిడీ నుండి కాపాడాలి
– మొదట్లో సాగును ప్రోత్సహించి, ఇప్పుడు అధిక సాగు అని చెప్పటం దుర్మార్గం
– బర్లీ పొగాకు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి
– ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారుల పక్షమా, లేక రైతుల పక్షమా తేల్చి చెప్పాలి
– లేని పక్షంలో మే 5న సీఎం చలో సీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం
– సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్
రాష్ట్రంలో నల్ల బర్లీ పొగాకు కు గిట్టుబాటు ధర కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో గురువారం సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సంయుక్త కిసాన్ మోర్ఛ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నల్ల బర్లీ పొగాకు రైతుల పట్ల వ్యాపారులు దుర్మార్గంగా వ్యవహరించి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నల్లబర్లీ పొగాకును సరాసరిన రూ. 15 వేలుకు కొనుగోలు చేస్తే, ఈ ఏడాది మాత్రం కేవలం రూ. మూడు నుండి నాలుగు వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇదేమని ప్రశ్నిస్తే అధిక విస్తీర్ణంలో సాగు చేశారని, అంతర్జాతీయంగా బర్లీ పొగాకు డిమాండ్ లేదని మోసపూరిత మాటలను చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక విస్తీర్ణంలో సాగు చేయమన్నది కార్పొరేట్ తొత్తులే కదా అని ప్రశ్నించారు. సమావేశానికి అతిథిగా హాజరైన నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బర్లీ పొగాకును సాగు చేసింది అది శాతం మంది ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కౌలు రైతులు అన్నారు. గతేడాది వచ్చిన ధరలను చూసి ఎక్కువ భాగం బలహీన వర్గాల పేదలు( రైతు కూలీలు) వ్యవసాయం రంగంలోకి వచ్చారన్నారు. కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి అధిక విస్తీర్ణంలో, బంగారం తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తే, నేడు మార్కెటింగ్ సమయంలో అదే కంపెనీ ప్రతినిధులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారనె నెపాన్ని రైతులు పైనే రుద్ది అతి తక్కువ ధరలకే బర్లీ పొగాకును కాజేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్పొరేట్ కంపెనీల కుట్రలను రైతులు ఐక్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే బర్లీ పొగాకు గిట్టుబాటు ధరలు వస్తాయని పేర్కొన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే వీరారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ ఈనెల 26 నుండి 30 వరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జిల్లా మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత బర్లీ పొగాకు సాగు చేస్తున్న రైతులను కలిసి, మే 5వ తేదీన చలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి, ఉపాధ్యక్షులు పరిటాల కోటేశ్వరరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోడూరి హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు పంటలు చేతికి వచ్చి మార్కెటింగ్ చేసే సమయాలలో రైతుల పక్షాన కాకుండా, వ్యాపారుల పక్షాన నిలిచి రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేయడంలో కొంతమంది రైతు నాయకులు అని చెప్పుకునే వారు కూడా ఉండటం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యాపారుల పక్షాన నిలుస్తుందో, రైతుల పక్షాన నిలిచి నల్ల బర్లీ పొగాకు గిట్టుబాటు ధర ఇప్పిస్తుందో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకట్రావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డే హనుమ రెడ్డి మాట్లాడుతూ బర్లీ పొగాకు సాగు రాష్ట్రంలో 9 జిల్లాలలో విస్తారంగా సాగు చేస్తున్నారన్నారు. వర్జీనియా పొగాకు కు ధీటుగా బర్లీ సాగు అవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు అందజేసే కార్యక్రమంలో, బర్లీ పొగాకు రైతులను కలిసి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో రెడ్ స్టార్ విప్లవ రైతు సంఘం నాయకులు భీమవరపు సుబ్బారావు, జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు కోడూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వర్జీనియా పొగాకు రైతులకు ‘చుండూరి ‘పిలుపు
పొగాకు వ్యాపారుల మోసాలకు గురై తీవ్రమైన నష్టాల బారీ న పడుతున్న వర్జీనియా పొగాకు రైతులు వెంటనే మేల్కొని వస్తే న్యాయపరంగా వారి పక్షాన ఎటువంటి పోరాటరానికైనా రైతు సీనియర్ నాయకులు చుంచు శేషయ్య వంటి అనుభవజ్ఞులను కలుపుకొని ముందుకు సాగుతామని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షులు, రెండు పర్యాయాలు పొగాకు బోర్డు సభ్యులు, అనేక రైతాంగ పోరాటాల సారధి చుండూరి రంగారావు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుండి మార్కెట్కు వచ్చిన అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను 20 నుండి 50 శాతం వరకు తక్కువ ధరలకు వ్యాపారులు మోసం చేసి రైతులను దోచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సులభతర వాణిజ్యం పేరుతో ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం దుర్మార్గము, కుట్ర పూరితమన్నారు. అయినప్పటికీ వర్జీనియా పొగాకు రైతులలో ఎటువంటి కదలిక లేదన్నారు. పొగాకు వేలం కేంద్రాలలో నాయకులు అని చెప్పుకునే వ్యాపారుల తొత్తులు ఇందుకు కారణం అన్నారు. సమస్యలు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకుపోతామని, పొగాకు బోర్డు అధికారులతో చర్చిస్తామని, వ్యాపారులతో మాట్లాడుతామని కల్లబొల్లి మోసపూరిత మాటలు చెప్పి సమస్యను దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వలాభాల కోసం, కమిషన్ కోసం రైతులను నిలువునా మోసం చేస్తున్న బ్రోకర్ రైతు నాయకులను తిప్పి కొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పొగాకు సాగు నియంత్రణ లేకుండా ఉండాలని కోరుకునే వారు స్వప్రయోజనా పరులైన వ్యాపారులు అన్నారు. వారి కోరికలకు అనుగుణంగా రైతు నాయకులను చెప్పుకునే కొందరు వ్యవహరిస్తూ రైతు ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా వర్జీనియా పొగాకు రైతులు మేల్కొని సాగు నియంత్రణలో ఉంటే మాత్రమే తమకు ధరలు లభిస్తాయని గ్రహించి పోరాటానికి సిద్ధమైతే తాము నిజాయితీపరులైన నాయకులను అందరినీ కలుపుకొని పోరాడి గిట్టుబాటు ధరలు సాధిస్తామన్నారు.ఆలస్యమయ్యే కొద్దీ మరింత మోసానికి, తీవ్రమైన నష్టానికి గురవుతారని హెచ్చరించారు.