ap news

సురక్షా యాప్ తో స్కాన్ చేశాకే మద్యం విక్రయాలు

బెల్టు దుకాణాల ద్వారా విక్రయిస్తే బెల్టు తీయండి

ఆర్టీజీఎస్ సమీక్షలో ఎక్సైజ్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

అమరావతి, అక్టోబరు 15: రాష్ట్రంలో ఏపీ ఎక్సైజ్ శాఖ రూపోందించిన సురక్షా యాప్ ద్వారా బార్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాతే మద్యం విక్రయాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వినియోగదారులు మద్యం బాటిళ్లపై బార్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాతే కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. బుధవారం ఆర్టీజీఎస్ లో నిర్వహించిన సమీక్షలో ఎక్సైజ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గతంలో మద్యం దుకాణాలను డిజిటలైజ్ చేయలేదని అందుకే క్రిమినల్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నించారని అన్నారు. బిచ్చగాడు చనిపోయినా దానిని మద్యం కేసుగా మలిచే ప్రయత్నం చేశారని సీఎం ఆక్షేపించారు. మద్యం కుంభకోణంలో ఉన్న వ్యక్తులు దీనిని రాజకీయం చేసి గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధపడ్డారని అన్నారు. గతంలో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ఏరులై పారించారన్నారు. రాష్ట్రంలో బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు చేసేందుకు ప్రయత్నిస్తే పీడీ యాక్టు ద్వారా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైతే దీని కోసం చట్టాన్ని కూడా సవరించడానికి సిద్ధం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బెల్టు దుకాణాల నిర్వహణలో ఏ పార్టీ వారున్నా వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బార్ కోడ్ స్కాన్ చేశాకే మద్యం కొనుగోలు చేసేలా అవగాహన పెంచాలని సీఎం సూచించారు. స్కాన్ చేసిన వెంటనే వివరాలు తెలిసేలా డిజిటల్ బోర్డును కూడా మద్యం దుకాణంలో వద్ద ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. బాటిల్ ధర, నాణ్యత, తయారీ వివరాలు తెలిసేలా ఈ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యానికి తావులేకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

త్వరలో బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి

రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ తో స్కాన్ చేసిన తర్వాతే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెల 13 తేదీ నుంచి సురక్షాయాప్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను ఇప్పటి వరకూ 27 వేల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ యాప్ ద్వారా 53,430 మంది మద్యం బాటిల్లను స్కాన్ చేశాకే మద్యం కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో 50,394 బాటిళ్లకు సంబంధించిన వివరాలు అక్కడికక్కడే కొనుగోలుదారులకు తెలిశాయని వివరించారు. 1348 మంది సరైన సమాచారాన్ని ఎంటర్ చేయకపోవటంతో ఇబ్బందులు వచ్చాయని పేర్కోన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని 1248 మంది స్కాన్ చేసినట్టు అధికారులు వివరించారు. లొకేషన్ ఆధారంగా వీటిని గుర్తించామని సీఎంకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని ఆదేశించారు. త్వరలోనే బీర్ బాటిళ్లకు కూడా బార్ కోడ్ ను పెట్టాలని సూచించారు. ఈ యాప్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఎక్కడా నకిలీ మద్యం లేకుండా చేయాలన్నారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *