ap news

దేశంలోనే బెస్ట్ మోడల్‌గా రాజధానిలో జస్టిస్ సిటీ నిర్మాణం

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి

మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం… కేసుల పరిష్కారం

మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయవాడ, మార్చి 01:- అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో ఆదివారం విజయవాడలో మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘రాజధాని నిర్మాణంలో జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథార్టీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ బెస్ట్ జ్యుడిషియల్ సిటీని నిర్మిస్తాం. వీటికి అవసరమైన భూములు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం… ఈ అకాడమీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం.

బెస్ట్ మోడల్ గా జస్టిస్ సిటీ

అమరావతిలోని జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు మేం ప్రయత్నిస్తున్నాం… దీనికి సీజేఐ సహకారం కావాలి. గ్రామాల్లో మధ్యవర్తిత్వం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించేవారు… మా తండ్రి కూడా పెద్దరికం వహించి గ్రామంలో సమస్యలను పరిష్కరించారు. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే రూ.10 వేలు ఇస్తాం… కేసులు పరిష్కారం కాకున్నా రూ. 3 వేలు ఇస్తాం. కేసులు పరిష్కారమై సత్వర న్యాయం అందితే… త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ క్రమంలో మధ్యవర్తిత్వంతో పరిష్కారమైన కేసులకు రూ.10 వేలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, పర్యావరణ హితంగా, ఆర్థికంగా బలమైన రాజధాని ఉండేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. వికసిత్ భారత్ -2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్లు తదితరులు హాజరయ్యారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ కు వెంకటేశ్వరస్వామి ప్రతిమ అందిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *