డిసెంబరు నాటికి పోలవరం డయాఫ్రం వాల్
గ్యాప్-1 ఈసిఆర్ఎఫ్ పనులు 2026 మర్చికి పూర్తి
పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం ప్రాజెక్ట్ , పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతి పై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు వేగంగా జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40 శాతం పురోగతి సాధించిందన్నారు. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానల్స్ గాను, ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానల్స్ పూర్తి చేసామన్నారు. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా, డివాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తామన్నారు. గ్యాప్-1 ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యామ్ పనులు, 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్యాప్-2 ఈసిఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సిడబ్ల్యూసి మరియు పిపిఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్ కు పనులు మొదలు పెడతామన్నారు.
పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకు వెళ్లేలా చంద్రబాబు లక్ష్యం కు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి రామానాయుడు ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ల దగ్గర బ్రిడ్జ్ ల పనులు ఆగస్టు లోగా పూర్తి చేయాలన్నారు. గత ఐదు సంవత్సరాల పాలనలో పోలవరం ఎడమ కాలువకు ఒక్క రూపాయి గాని, ఒక తట్ట మట్టి పనులు గానీ చేయలేదని మంత్రి రామానాయుడు అన్నారు.