ap news

ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం

వైద్యారోగ్య రంగంలో పెట్టుబడి పెట్టాలని బుర్జిల్ సంస్థను కోరిన సీఎం

ఆసక్తి కనపర్చిన దుబాయ్ పారిశ్రామికవేత్తలు

దుబాయ్, అక్టోబర్ 22:- ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానాలకు యూఏఈ పారిశ్రామిక వేత్తలు సానుకూలంగా స్పందిస్తున్నారు. యూఏఈలో మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు దుబాయ్ లో బుధవారం పర్యటించిన చంద్రబాబు..అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్, బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షంషీర్ వయాలిల్‌తో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ క్రమంలో షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగంలో పేరొందిన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్‌కు రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై సీఎం వివరించారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని..పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంతోపాటు… షిప్ బిల్డింగ్ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్టు సీఎం ఆ సంస్థ ఛైర్మన్ రామకృష్ణన్‌కు తెలిపారు.

వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం

అబుదాబిలోని వైద్యారోగ్య రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఆ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ సంస్థ ఆసక్తి కనబరిచింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌పై తమ సంస్థకు విశేషమైన అనుభవం ఉందని సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అబుదాబిలో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. బుర్జిల్ సంస్థ ఛైర్మన్‌తో భేటీలో భాగంగా వైద్యారోగ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను సీఎం వివరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *