కాపు జేఏసీ మహిళా విభాగం కన్వీనర్ గా లక్ష్మీ సుకన్య
కాపు రిజర్వేషన్లను సాధించాలి
ఐక్యతే కాపుల బలం
రౌండ్ టేబుల్ సమావేశంలో లక్ష్మీ సుకన్య
కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు కులాల రాష్ట్ర జేఏసీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ గా పండ్రంగి లక్ష్మీ సుకన్య నియమితులయ్యారు. విశాఖఫట్నంలో శనివారం ఆమె జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అమ్మ శ్రీనివాస్ నాయుడు నుంచి నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు కులాల రాష్ట్ర జేఏసీ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాపులకు రిజర్వేషన్లు లేకపోవటం వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో కాపు యువత అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. కాపులు ఐక్యతగా ఉంటే అన్ని రంగాల్లో ప్రాధాన్యత వస్తుందన్నారు. దశాబ్దాల కాలంగా కాపులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన పెంచుకొని మలిదశ పోరుబాటకు అందరూ సిద్దంగా ఉండాలన్నారు. కాపుల రిజర్వేషన్ రాజకీయ నిర్ణయాలతో ముడిపడి ఉంది. రాజకీయంగా సంఘటితంగా ఉన్నామన్న సంకేతాలను ప్రభుత్వాలకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తాను 26 జిల్లాల్లో పర్యటించి అప్పగించిన బాధ్యతలను త్రికరణశుద్దితో నెరవేరుస్తాననీ, మహాబలి చక్రవర్తి, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయుల త్యాగాలను స్పూర్తిగా తీసుకుని కాపుల్లో చైతన్యం ప్రోది చేసేందుదుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.