దళిత గిరిజన అభివృద్ది పట్టని ప్రభుత్వం
సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు బహిరంగ లేఖ
దళిత గిరిజనుల సంక్షేమం అభివృద్ధి రక్షణ పై ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి వారి పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ధ్వజమెత్తారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన నవరత్నాలు కాకుండా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా అమలు కావలసిన ప్రత్యేక సంక్షేమం, అభివృద్ధి పథకాలు..బడ్జెట్ లో వాటికి కేటాయింపులు, దళిత గిరిజనులు సాధించిన ప్రగతిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు సంక్రమించిన ప్రత్యేక హక్కులు చట్టాల పట్ల అనుసరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు తమ దృష్టికి తీసుకువచ్చినా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తే సహించేది లేదని గిడుగు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ , కొరివి వినయ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడుర బొర్రా కిరణ్, నగర అధ్యక్షుడు, నరహరిశెట్టి నరసింహారావు, మదాన మోహన్ రెడ్డి, హరికుమార్ రాజు, మీసాల రాజేశ్వరరావు, ఖాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.