ఎల్ నినో.. అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలి
సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ బృందం వినతి
అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం కలిసి పలు అంశాలపై రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాల్లో తాము పర్యటించామని తెలిపారు. ఎల్నినో కారణంగా తలెత్తిన కరువు పరిస్థితులను సాధారణ ప్రకృతి వైపరీత్యంగా కాకుండా అత్యవసర పరిస్థితిగా పరిగణించాలన్నారు. పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉన్నారు.

