ap news

చంద్రబాబూ..ఎందుకు ఏడుపు..!

పేదల ఇళ్లపై ఎప్పుడూ ఏడుపేనా బాబు?
బాబూ పేదలంటే నీకు ఎందుకింత వ్యతిరేకత?
సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకున్నారు
ఓటీఎస్‌నూ వద్దంటున్నారు. వ్యతిరేకిస్తున్నారు
లేఅవుట్లలో 5 శాతం భూనిర్ణయాన్నీ తప్పు పడుతున్నారు
సూటిగా ప్రశ్నించిన మంత్రి బొత్స సత్యనారాయణ

సామాన్యుడు సొంత ఇల్లు కావాలనుకోవడం తప్పా?
వారికి ప్రభుత్వం ఇళ్లు ఇవ్వాలనుకోవడం తప్పా?
పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు గగ్గోలు ఏంటి?
గట్టిగా నిలదీసిన మంత్రి  బొత్స సత్యనారాయణ

ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. ఓటీఎస్, 30 లక్షల ఇళ్లు..
లేఅవుట్లలో 5 శాతం భూమి. పేదలకు భూబ్యాంక్‌ ఏర్పాటు
ఇలా అన్నీ అమలు చేస్తాం. ఎక్కడా వెనుకంజ వేయబోము
మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రకటన

ఆ రెండు మీడియాల్లో అసత్య కథనాలు వండి వారుస్తున్నారు
జవసత్వాలు పోయిన చంద్రబాబుని నిలబెట్టాలని చూస్తున్నారు
నిత్యం విమర్శలు. ఆక్షేపణలు. రాష్ట్రంలో ఎల్లో మీడియా తీరు ఇది
కానీ వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. వారన్నీ గమనిస్తున్నారు
అందుకే స్థానిక ఎన్నికల్లో మాకు అఖండ మెజారిటీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రెస్‌మీట్‌లో మంత్రి  బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..:

అదే పనిగా దుష్ప్రచారం:
నిరుపేద ప్రజల సంక్షేమం, మధ్య తరగతి వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్ష టీడీపీ, దానికి వత్తాసు పలుకుతున్న రెండు పత్రికలు, మూడు ఛానళ్లు వాటిపై అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. అదేదో ప్రజలకు భారం. వారిని ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఒక అసంతృప్తి రగిల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవి గతంలోనూ చూశాం. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

ఇళ్ల స్థలాలనూ అడ్డుకున్నారు:
రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా, 30 లక్షల ఇళ్లు కట్టిస్తున్న నేపథ్యం. దానికి తూట్లు పొడవాలని కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చారు. దాంట్లో అక్రమాలు జరిగాయని గగ్గోలు పెడుతున్నారు. సాక్షాత్తూ అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమైతే డెమోగ్రఫిక్‌ ఇమ్‌బ్యాలెన్సెస్‌ వస్తాయని, ప్రజల్లో అసమానతలు వస్తాయని సృష్టించి, పేదలు అక్కడ ఉండడానికి వీల్లేదన్నారు. అలాగే విశాఖలో పేదల ఇళ్ల కోసం ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తే.. ఆ ప్రాంతంలో భూమి ఇచ్చిన వారు కాకుండా దానికి సంబంధం లేని వ్యక్తులు సాంకేతిక పరమైన అంశాలు అడ్డం పెట్టుకొని న్యాయస్థానాలకు పోయి వాటి మీద స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్లు అందకుండా చూస్తున్నారు.

ఓటీఎస్‌తో ఎన్నో ప్రయోజనాలు:
ఇటీవలే నిరుపేదల ఇళ్ల రుణాలకు సంబం«ధించి ఓటీఎస్‌ ప్రకటించాం. పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని నిర్ణయించాం. వారి ఇంటి మీద ఎంత అప్పు ఉన్నా సరే, ఒకేసారి కొంత మొత్తం.. రూ.10 వేలు (గ్రామీణ ప్రాంతాలు), 15 వేలు (పట్టణాలు), రూ.20 వేలు (నగరాలు) చెల్లిస్తే, వారికి ఆ ఇంటిపై పక్కాగా హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని నిర్ణయించాం. దీని ద్వారా వారి ఆర్థిక అవసరాలు కూడా తీరుతాయని భావించాం. ఎలా అంటే వారికి తమ ఇంటిపై హక్కులు ఇస్తూ, రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తే, అత్యవసర పరిస్థితుల్లో ఆ ఇంటిని తాకట్టు పెట్టుకోవడం లేదా అమ్ముకోవడం చేయొచ్చు. లేదా పిల్లల పెళ్లిల్లకు ఇంటిని కట్నాలు, కానుకల కింద ఇవ్వొచ్చు. అలా పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తూ ఈ కార్యక్రమం పెడితే దానిపైనా గగ్గోలు పెడుతూ, పెడర్ధాలు తీస్తూ, లేనిపోని అలజడి సృష్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు.

పేదలకు భూబ్యాంక్‌:
కొత్త లేఅవుట్లలో 5 శాతం భూమి లేదా ఆ లేఅవుట్‌కు 3 కి.మీ దూరంలో అంతే భూమి కొనివ్వడం కానీ లేదా ఆ భూమి కార్డు విలువ ప్రభుత్వానికి కడితే, పేదల కోసం భూమి బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తే, దాన్నీ తప్పు పడుతున్నారు. ప్రభుత్వం ధనార్జన కోసం, నిధుల సేకరణ కోసమే ఆ పని చేస్తుందని విమర్శిస్తున్నారు.
నేను సూటిగా చంద్రబాబును ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు నిరుపేదలు అంటే ఎందుకు అంత కోపం? వారిపై ఎందుకు మీకంత కక్ష? బలహీన వర్గాల మీద ఎందుకంత ఆక్రోషం? ప్రభుత్వం ఏం చేస్తున్నా సరే అదే పనిగా నిందిస్తున్నారు.

పార్లమెంటులోనూ..:
చివరకు పార్లమెంటులో కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, అందువల్ల సంక్షేమ కార్యక్రమాలు ఆపేయాలని సాక్షాత్తూ రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు మాట్లాడుతుంటే, మనం ఎక్కడికి వెళ్తున్నట్లు?. అప్పు అనేది ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి తీసుకుంటారు. ఎవరైనా సరే. అయినా తప్పు పడుతున్నారంటే మీ దుర్భుద్ధి, ఆలోచన బయట పడుతుంది.
సీఎం వైయస్‌ జగన్‌ ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక అకుంఠిత దీక్షతో, అంకితభావంతో పని చేస్తారు. అదే చంద్రబాబునాయుడుగారు అధికారంలో ఉన్నప్పుడు మాటలతో మోసం, మాయ చేయడాన్ని చాలాసార్లు చూశాం. ఇప్పుడూ చూస్తున్నాం. చంద్రబాబుది అలాంటి తత్వం.

ఇక్కడ ప్రెస్‌మీట్‌ ఎందుకంటే..?:
మీ ద్వారా మళ్లీ ఒకసారి రాష్ట్ర ప్రజలు, సామన్యులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం తరపున బాధ్యత కలిగిన మంత్రిగా ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఈ ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉంది. పేదవారి కోసం, మధ్య తరగతి వారి కోసం ఎంత వరకైనా సరే ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. పేదల అభ్యున్నతి, ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి, వారి మనసులో ఉన్నవి నెరవేర్చడానికి మా ప్రభుత్వం, మా సీఎంగారు ఎక్కడా రాజీ పడం. అన్నీ చేసి తీరుతాం.

ఇవేవీ కొత్తవి కావు:
అందులో భాగంగానే ఓటీఎస్‌ కానీ, 30 లక్షల ఇళ్లు కట్టించి ఇవ్వడం కానీ, పేదల కోసం భూ బ్యాంక్‌ ఏర్పాటుకు 5% భూమి వంటి నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది. అయితే ఇవేవీ మేము కొత్త్తగా చేస్తున్నవి కావు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చాలా రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. కొన్ని చోట్ల 10% భూమి కేటాయింపు చేసి.. ప్రభుత్వ ధరకే ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ విధానం తీసుకున్నాము.

అయినా సరే..ఆ మీడియా!:
దీని వల్ల ఎవరికి ఇబ్బంది ఉంది. ఎందుకు ఆ రెండు, మూడు పత్రికలు, ఛానల్స్‌ గగ్గోలు పెడుతున్నాయి. ఎవరి లాభం కోసం ఆ పని చేస్తున్నారు. ఎవరి ప్రమేయంతో మీరు ఆ గోల చేస్తున్నారు. సామాన్యుడికి సొంత ఇంట్లో ఉండే హక్కు లేదా? ప్రతి పేదవాడు సొంతిల్లు ఉండాలని కల కనటం తప్పా? వారు సొంత ఇల్లు ఉందన్న ధీమాతో ఉండడం తప్పా? పేదలకు సొంతిల్లు హక్కు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేయటం తప్పా? చంద్రబాబూ మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అసలు మీ ఉద్దేశం ఏమిటి?. కొన్ని మీడియా ఛానల్స్, సంస్థలు చంద్రబాబుకు వత్తాసు పలకటం ఏంటి? ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను, మంత్రులను వివరణ అడగొచ్చు కదా. మేం చెప్పింది మీడియా వినాలని అడగటం లేదు. మీ వక్రబుద్ధి.. మీ తాలూకా పచ్చతనం మాకు తెల్సు.

ఏనాడైనా వాస్తవాలు మాట్లాడారా?:
ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ఏనాడైనా ప్రభుత్వం తెచ్చిన ఏ పథకాన్ని అయినా హర్షించారా? మెచ్చుకున్నారా? శ్రీ జగన్‌ గారు మంచి కార్యక్రమం చేశారని ఏమైనా చప్పట్లు కొట్టారా. ఎక్కడా లేదు కదా. మీ దారి మీది. మీ ఆలోచన మాకు తెల్సు. మీరు ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర రాజకీయాలను శాసించాలని అనుకుంటున్నారు. జవసత్వాలు లేకుండా పడిపోయిన చంద్రబాబును పైకి ఎత్తాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు.

నిజాయితీ, నీతికే పట్టం:
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిజాయితీకి, నీతికి పట్టం కడతారు. చెప్పిన మాటను ఎవరైతే అమలు చేస్తారో.. ఎవరైతే ఆ మాట మీద నిలబడతారో వారికి ప్రజలంతా అండగా ఉంటారు. స్వర్గీయ రాజశేఖరరెడ్డిగారు 2004లో ముందు పాదయాత్ర చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నమ్మి 2004లో పట్టం కట్టారు. ఆ తర్వాత 2004 నుంచి 2009 వరకు ఆయన పరిపాలన చూసిన తర్వాత మళ్లీ వైయస్‌ఆర్‌కు ప్రజలకు పట్టం కట్టారు. ఎందుకంటే మాట మీద నిలబడిన వ్యక్తిని గౌరవించేది ఈ రాష్ట్ర ప్రజలు. అలాంటి సంస్కృతి రాష్ట్ర ప్రజలది. అంతే కానీ చంద్రబాబులా మాటకారికి ఓటేయరు.

ఆయనది మోసం. దగా:
ఆంధ్రరాష్ట్రం అప్పుడే పుట్టిన బిడ్డ అని 2014 ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు, పెంచుతాను అని ఒక అవకాశం ఇవ్వమని అడిగి అధికారం చేపట్టారు. కానీ ఆ తర్వాత ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా మోసం, దగా, మాయ చేశారు. ఒక్క కార్యక్రమాన్నీ నెరవేర్చలేదు. అందుకే ప్రజలు ఛీ కొట్టారు.

కష్టాలు, ఇబ్బందులు వచ్చినా..:
మాటకు కట్టుబడి ఉండే శ్రీ వైయస జగన్‌ను విశ్వసించిన ప్రజలు 2019లో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ విషయం అందరికీ తెల్సు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి సీఎం శ్రీ జగన్‌ తాపత్రయ పడుతున్నారు. దీనికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గత చంద్రబాబు ప్రభుత్వం వల్ల అప్పుల భారం పెరిగినా అన్నింటినీ సరి చేసుకుంటూ పరపతి పెంచుకుంటూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు.
కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయినా ఆంధ్ర రాష్ట్రం తణుకుబెణుకు లేకుండా ప్రతి ఒక్కరికీ అండగా శ్రీ జగన్‌ ప్రభుత్వం ఉందనే ధైర్యాన్ని కల్పించింది. ఇది వాస్తవం. అందువల్లే ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల తప్ప.. 100కు 100 «శాతం నూటికి నూరు శాతం çపట్టం కట్టారు.

మీరు మారరు. అదే ధోరణి:
ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా ఎల్లో మీడియా ధోరణి మారడం లేదు. ఆ రెండు పత్రికలు చూసినా, ఆ మూడు టీవీలు ఆన్‌ చేస్తే ఆ ఛానల్స్‌ ఎవరెవరినో కూర్చొబెట్టి.. రోజూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆడిపోసుకుంటున్నారు. మిమ్మల్ని భగవంతుడు కూడా మార్చలేరు. మారుతారని కూడా మేం అనుకోవటం లేదు. ఎందుకంటే మీతో మాకు పని లేదు.

అందుకే చెప్పాల్సి వస్తోంది:
ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలి కాబట్టి, ఎక్కడైనా అర శాతమో.. ఒక శాతమో.. ప్రలోభాలకు లోనవుతారనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ వివరాలు చెప్పాల్సి వస్తోంది. మేం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అని ప్రజలందరికీ తెలుసు. నాడు–నేడు ద్వారా స్కూళ్లు పూర్తిగా మారుస్తున్నాం. ఆరోగ్యశ్రీలో దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య ఆరోగ్య రంగంలో అర్బన్, రూరల్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఒకటేమిటి, రెండు ఏమిటి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అడగండి.
చంద్రబాబు ఇక్కడ ౖహైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడడం కాదు. వరద ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే, ప్రజలు ఆదరించారంటూ, చంద్రబాబు వారినే తప్పు పట్టారు. ప్రజలకు బుద్ధి లేదు అన్నారు. ప్రజల ఆదరణ తెలిసినా మీ ధోరణి మార్చుకోరు.

ఈ ప్రభుత్వం మీది:
ఏదేమైనా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది. మీ ఆలోచనలతో వచ్చిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ అధినేత సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా తట్టుకుని వాటిని అమలు చేస్తారు. పేదవాళ్లకు మంచి జరగకూడదని చంద్రబాబునాయుడుగారు ఎన్ని తపస్సులు చేసినా, వారికి ఇళ్లు దక్కకూడదని ఎన్ని ఆక్రోషాలు పెట్టినా.. మేము నెరవేర్చి తీరుతాం. వాటి కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేం తట్టుకుంటాం.
చెప్పిన ప్రతిదీ అమలు చేసి తీరుతామని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ.. కొత్తగా వేసే లేఅవుట్లలో 5 శాతం భూమి కానీ, ఇతర ఆదాయం కానీ ఏదైనా సరే పేదల ప్రజల కోసం భూబ్యాంక్‌ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే జనాభా పెరుగుతోంది. ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి, అందుకు తగినట్లుగా పేదలకు ఇళ్లు కావాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.

వారికీ మా విజ్ఞప్తి:
అదే విధంగా లేఅవుట్లు వేసే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. సామాజిక స్పృహతో కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి. కల్లబొల్లు కబుర్లు చెప్పే చంద్రబాబు మాయలో పడకండి. ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.. అని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *