ఘనంగా ‘గడ్డ కట్టిన నది’ ఆవిష్కరణ
ప్రముఖ కవి, లీడ్ గ్రంథాలయం వ్యవస్థాపకుడు కాసుల రవికుమార్ రచించిన ‘గడ్డ కట్టిన నది’ కవిత్వ సంపుటి ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు.జూనియర్ చాంబర్ ఆఫ్ ఇండియా(జె సి ఐ) ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సభకు జె సి ఐ అధ్యక్షుడు డాక్టర్ జి.రవికుమార్ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ కవిగా, ఇంగ్లీషు అధ్యాపకుడిగా, లీడ్ గ్రంథాలయ వ్యవస్థాపకుడిగా కాసుల రవికుమార్ సాహిత్య వ్యాప్తికి ఎంతగానో కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. పుస్తకాన్ని జాహ్నవి నీట్ అకాడమీ డైరెక్టర్ జనార్ధన్ ఆవిష్కరించగా, ప్రముఖ సాహితీవేత్త జానుడి – సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ పుస్తకాన్ని సమీక్ష చేశారు. రవి కుమార్ కవిత్వంలో సామాజిక పరిణామ స్పృహ సరళ వాక్యమై మనల్ని చుట్టుకుంటుందని, నిత్యమూ మానవీయ చైతన్యాన్ని అన్వేషిస్తుందని అన్నారు.సభలో జె సి ఐ ప్రతినిధులు నయనాల రామకృష్ణ, నారాయణరెడ్డి, తన్నీరు సురేష్, సోమినేని సురేష్, నాయుడు, పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.