స్వచ్ఛంధ సేవకు డాక్టర్లకు ఆహ్వానం
-
చిన్న పిల్లల గుండె చికిత్స కోసం
-
స్వచ్ఛంధంగా ముందుకు రండి
-
వైద్యులకు టిటిడి ఆహ్వానం
చిన్నపిల్లల గుండె చికిత్సల కోసం స్వచ్ఛంధంగా ముందుకు వచ్చే డాక్టర్లకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం పలుకుతోంది. ఈ మేరకు టిటిడి అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించనున్న శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయం ( శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ) ఆసుపత్రి లో స్వచ్ఛంద సేవలు అందించడానికి భారతదేశంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ పీడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు, డాక్టర్లును ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
టీటీడీ ప్రాణదానం పథకం కింద నిర్వహించనున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె చికిత్సలు, వైద్య సేవలు అందించడం కోసం కనీసం 15 సంవత్సరాల అనుభవం కలిగిన హిందూ మతానికి చెందిన డాక్టర్లు వారి ఆసక్తిని తెలియజేయాలని కోరింది. ఈ స్వచ్ఛంద సేవలను ఆప్షన్ A, ఆప్షన్ B అనే రెండు విధానాల్లో చేయవచ్చు. ఆప్షన్ A విధానం లో స్వచ్ఛంద సేవ కోసం వచ్చే డాక్టర్ తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రోటోకాల్ దర్శనం, తిరుమల – తిరుపతి మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారు.
ఆప్షన్ B కింద.స్వచ్ఛంద సేవ కై ఆసక్తి కనపరిచే వైద్య నిపుణులకు టీటీడీ నియమ నిబంధనల మేరకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషకం చెల్లించడం జరుగుతుంది. ఆప్షన్ B ఎంచుకునే వారికి వసతి, దర్శనం, స్థానికంగా రవాణా సదుపాయాలు కల్పించడం జరగదు. ఆసక్తి గల వైద్యనిపుణులు cmo.adldirector@gmail.com మెయిల్ ఐడి కి తమ వివరాలతో పాటు ఏయే కేటగిరీ కింద ఆసక్తి ఉందో తెలియజేస్తూ, వారి యోగ్యతా పత్రాలను జత చేయాలని టీటీడీ కోరింది.