25న కర్నూల్ లో సంజీవని ప్రారంభం

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి పీహెచ్సిలో సంజీవని ప్రాజెక్టు ఈ నెల 25న జరిగే ప్రారంభ కార్యక్రమ ఏర్పాటపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్ మంగళవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన గణేశన్ వీరపాండియన్ సంజీవని ప్రాజెక్టును సీఎం శ్రీ చoద్రబాబు ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వీరపాండియన్ దిశా నిర్దేశం చేశారు. కార్యదర్శి హోదాలో సీఎం చంద్రబాబు , వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ల లక్ష్యాలకు అనుగుణంగా సంజీవని ప్రాజెక్టును ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని, రోగుల హెల్త్ కార్డుల్ని డిజిటలైజ్ చేయడం ద్వారా పూర్తి ఆరోగ్య , చికిత్సల సమాచారాన్ని వీటిలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ గా పనిచేసినoదున…
ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నవారు వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా ఇప్పటివరకు
వ్యవహరించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్గా ఏడాదిన్నరకు పైగా పనిచేసిన తాను ఈ శాఖపై తగిన అవగాహనను పెంచుకున్నానని, ఈ అనుభవంతో కార్యదర్శిగా మరింత మెరుగైన సేవల్ని అందిస్తానని తెలిపారు. కార్యదర్శిగా బాధ్యతల్ని స్వీకరించిన వీరపాండియన్కు ఆయా శాఖల విభాగాధిపతులు, ఉద్యోగులు పూలగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.
కీలక బాధ్యతలు
2009లో ఐఎఎస్ అధికారిగా సివిల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టిన ఆయన 2010లో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా మొదటి పోస్టింగ్ పొందారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ గా, భద్రాచలం ఐటిడిఎ పీఓగా, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్గా, పనిచేశారు. 2015లో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్గా పనిచేసిన వీరపాండియన్ అనంతరం అనంతపురo, కర్నూలు జిల్లాలకు కలెక్టర్గా సేవలందించారు. తదనంతరం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండిగా, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా, తిరిగి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండిగా, డైరెక్టర్గా బాధ్యతల్ని నిర్వహించారు. అనంతరం సెర్ప్ సిఇఓగా పనిచేసిన ఆయన మరోసారి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండిగా, కమీషనర్గా సేవలందించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం వైద్యారోగ్య శాఖ కార్యదర్శితో పాటు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్గా, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్గా, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్గా, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఎపిఎంఎస్ఐడిసి) మేనేజింగ్ డైరెక్టర్(FAC)గా బాధ్యతల్ని చేపట్టారు.
