అదనంగా మరో 175 ఎంబీబీఎస్ సీట్లు

పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 సీట్లతో అనుమతి
విజయవాడ ప్రభుత్వ సిద్దార్ధకు అదనంగా 75 సీట్లు
ఈ విద్యా సంవత్సరంలోనే 4 ప్రభుత్వ కళాశాలల్లో అదనంగా 325 సీట్లు
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో అదనంగా 505 సీట్లు
ప్రైవేట్లో వైద్య కళాశాలల్లో 550 సీట్లు
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అదనంగా 1055 సీట్లు
నీట్ మెరిట్ విద్యార్థులకు భారీ ఊరట..
ఆనందం వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య విద్య విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసి) రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ వైద్య కళాశాల(పిడుగురాళ్ల, విజయవాడ)ల్లో 175 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా లభించిన సీట్ల సంఖ్య 325కు చేరింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో 100 సీట్లతో ప్రవేశాలు జరిపేందుకు ఎన్ఎంసి అనుమతినిచ్చింది. అదే విధంగా విజయవాడ ప్రభుత్వ సిద్దార్ధ వైద్య కళాశాలకు అదనంగా 75 సీట్లను ఎన్ఎంసి మంజూరు చేసింది. ఈ మేరకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసి) లెటర్ ఆఫ్ పర్మిషన్లను సోమవారం జారీ చేసింది. ఇప్పటికే కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్ల పెంపునకు ఎన్ఎంసి ఆమోదం తెలిపింది. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 అదనపు ప్రవేశాలు జరుగనున్నాయి. దీంతో ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాల ల ద్వారా 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు లభించినట్లైంది. 2024-25 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 505 సీట్లు అదనంగా లభించాయి. ఎంబీబీయస్ సీట్లు భారీగా పెరగడంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న నీట్ మెరిట్ విద్యార్థులకు ఊరటనిస్తోoది.

మంత్రి సత్యకుమార్ నిరంతర కృషి
ఈ ఫలితాల వెనుక రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ చేసిన నిరంతర కృషి కీలకంగా నిలిచింది. ఎన్ఎంసి అనుమతులు పెండింగ్లో ఉన్న ప్రతి కళాశాల పురోగతిని స్వయంగా సమీక్షిస్తూ, ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ, ఎన్ఎంసి ఉన్నతాధికారులతో పలుమార్లు సంప్రదించి రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోదం వచ్చేలా మంత్రి సమన్వయం చేశారు. అధికారులు గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసేలా ప్రత్యేక దృష్టి సారించడంతో వరుసగా ఫలితాలు వస్తున్నాయి. అత్యంత కీలకమైన పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల విషయంలో సాంకేతిక అంశాలు అడ్డంకిగా మారిన సమయంలో మంత్రి స్వయంగా వ్యవహారాన్ని పర్యవేక్షించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పరికరాల కల్పనను వేగవంతం చేయడంతో ఎన్ఎంసి 100 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలోనే అక్కడ తొలి బ్యాచ్ విద్యార్థులు అడుగుపెట్టనున్నారు.కూటమి ప్రభుత్వ హయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా భారీ స్థాయిలో 505 ఎంబిబియస్ ప్రవేశాలకు అవకాశం లభించడంపై మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీని వలన పేద విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
విద్యార్థులకు ఎలా ఉపయోగం..
రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు పెరగడం వల్ల నీట్లో అర్హత సాధించిన మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశ అవకాశాలు మరింత పెరగనున్నాయి. గతంలో కొద్దిపాటి ర్యాంకు తేడాతో ప్రభుత్వ సీటు కోల్పోయిన అనేక మంది పేద విద్యార్థులకు ఇప్పుడు అవకాశం దక్కే పరిస్థితి ఏర్పడుతోంది. ఖరీదైన ప్రైవేట్ వైద్య కళాశాలలను ఆశ్రయించాల్సిన అవసరం ఈమేరకు తగ్గనుంది. పేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుంది. అదనపు ప్రవేశాలతో రాష్ట్రానికి అవసరమైన వైద్యులు అందుబాటులోకొస్తారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2026-27లో సీట్ల పెంపు ఇలా…
నెల్లూరు-25
పాడేరు-50
కడప -75
విజయవాడ-75
పిడుగురాళ్ల -100
———————-
మొత్తం-325
———————–
కూటమి ప్రభుత్వ హయాంలో 1055 అదనపు ఎంబిబియస్ సీట్లు
2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 505, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 550 అదనపు ఎంబిబియస్ ప్రవేశాలకు అనుమతులు లభించాయి. ఎన్ఎంసి నియమాల మేరకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అదనంగా 50 శాతం సీట్లు గవర్నమెంట్ కోటాలో ( కన్వీనర్ కోటా) 275 సీట్లు విద్యార్థులకు దక్కుతాయి. మొత్తమ్మీద…2024-25 నుండి కూటమి ప్రభుత్వ హయాంలో 1055 అదనపు ఎంబిబియస్ సీట్లకు అనుమతులొచ్చాయి. ఈ అదనపు సీట్లతో రాష్ట్రంలో మొత్తం ఎంబిబియస్ సీట్ల లభ్యత 7090కి పెరిగింది. ఇందులో 15 శాతం సీట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో లభించడం విశేషం.
