ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్

డ్రైవర్ల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తాం
ఆటోలపై జరిమానాల భారం తగ్గిస్తాం
ప్రభుత్వం చేసే మంచి పనిని డ్రైవర్లే ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పరదాలు కట్టుకుని రాలేదు… దర్జాగా ఆటోలో వచ్చాం
చెడుపై మంచి సాధించిన విజయమే పండుగల స్ఫూర్తి
దుష్టులు మళ్లీ రాకూడదు… అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు
‘ఆటో డ్రైవర్ సేవలో…’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
2.90 లక్షల డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్ల జమ
క్యాంప్ ఆఫీసు నుంచి సభా ప్రాంగణం వరకు 14 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించిన సీఎం

విజయవాడ, అక్టోబర్ 4: ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించి లబ్దిదారులకు చెక్కులు అందించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రాష్ట్రంలోని 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లు జమ చేశారు. సభా ప్రాంగణంలో డ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కాలను ధరించి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ…”కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరాయి. సంక్షేమం దరిచేరింది. ఉబర్, ర్యాపిడో వంటి యాప్ లు ఉన్నాయి. వీటి ద్వారా ఆటో డ్రైవర్లు కొంత మేర ఇబ్బంది పడుతున్నారు. వాటిని ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆటో డ్రైవర్ల కోసం ఓ యాప్ తెస్తాం. ఆ యాప్ ద్వారా ఆటో డ్రైవర్లకు బుకింగ్ లు వచ్చేలా చూస్తాం. కిరాయి కోసం ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తాం. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం. యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి… ఆటో డ్రైవర్ల భవిష్యత్తును మరింత మంచిగా తీర్చిదిద్దేలా పనిచేస్తాం. ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఎవరికి లంచాలు ఇవ్వకుండా, కార్యాలయాలకు తిరగకుండా అర్హుల అందరి బ్యాoక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. అర్హులు ఏ ఒక్కరికి డబ్బులు జమ కాకపోయినా ప్రభుత్వానికి చెప్పండి… ఆర్హతను బట్టి ఖాతాలో వేస్తాం.”అని సీఎం చెప్పారు.
