స్టెమీతో 95.94 శాతం మందికి తప్పిన ప్రాణగండo
‘గోల్డెన్ అవర్’ లో ఉచితంగా ‘టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్’ తో గుండెకు రక్షణ
ప్రైవేట్ లో ఒక్కొక్క ఇంజెక్షన్ ధర రూ. 40,000 నుంచి 45,000… ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితం
అనంతపురం, వైజాగ్, కర్నూలు జిల్లాల్లో అత్యధిక వినియోగం
వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
గ్రామీణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిన వారికి ‘అత్యవసర వైద్యం’ (గోల్డెన్ అవర్) కింద స్టెమీ విధానంలో ఇస్తున్న చికిత్సవల్ల గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు 3,027 మంది ప్రాణాలు నిలిచాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో 238 ప్రభుత్వ సామాజిక(CHCs), ప్రాంతీయ(AHs), జిల్లా ఆసుపత్రుల్లో(DHs) ప్రవేశపెట్టిన ‘స్టెమీ’ (ST-segment elevation myocardial infraction) విధానం కింద ఖరీదైన ‘టెనెక్టెప్లస్’ ఇంజెక్షన్ ఉచితంగా ఇవ్వడం ద్వారా విలువైన ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. ఛాతీనొప్పి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారిలో ‘టెనెక్టె ప్లేస్’ ఇంజక్షన్ అవసరమని గుర్తించిన 3,155 మందిలో 3,027 (95.94%) మంది ప్రాణాలు నిలబడినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు ఇంజెక్షన్ పొందిన మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమించి ఉండడం, సమయం మించిపోవడం వంటి కారణాలతో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఈ సంఖ్యను ఇంకా తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్సీడీ-4.0 సర్వేలో భాగంగా స్టెమీ విధానం అమలుపై ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం.ల ద్వారా ఛాతీనొప్పి లక్షణాలు ఎలా గుర్తించాలన్న దానిపై శిక్షణ ఇవ్వబోతున్నామని మంత్రి సత్యకుమార్ కు ఉన్నతాధికారులు నివేదించారు.
ఆసుపత్రుల్లో సౌకర్యాలు, పరికరాల కోసం రూ.16.60 కోట్లు వ్యయం
స్టేమీ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు 238 ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, యంత్రాల కోసం కలిపి రూ.16.60 కోట్లు ఖర్చుపెట్టారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంజక్షన్ ధర రూ. 40,000 నుంచి 45,000 వరకు ఉంది. ఇతర ఖర్చులు అదనం. ప్రభుత్వం టెండర్ ద్వారా వీటిని కొనుగోలు చేస్తోంది. ఒక్కొక్క ఇంజెక్షన్ కు రూ.19,000తోపాటు అదనంగా ఇతర మందుల కోసం రూ. 6,000 ఖర్చుపెడుతోంది. దీని ప్రకారం ఇప్పటివరకు లబ్ధిపొందిన 3,155 మందికి కలిపి రూ.7.88 కోట్ల వరకు ప్రభుత్వం వ్యయం చేసింది.
సిద్ధంగా ఇంజెక్షన్లు
ప్రతి సీహెచ్సీలో 3, ఏరియా ఆసుపత్రిలో 4, జిల్లా ఆసుపత్రిలో 5 చొప్పున ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నారు. అవసరాలకు అనుగుణంగా అదనంగా అవసరమైతే తక్షణమే పొందే విధంగా ఇంజెక్షన్లు జిల్లా మందుల గిడ్డంగుల్లో సిద్దం ఉంచుతున్నారు .
సగటున 175 మందికి
స్టెమీ చికిత్స కింద ప్రతి నెలా సగటున 175 మంది ప్రభుత్వాసుపత్రుల్లో టెనెక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ పొందుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 201, సెప్టెంబరులో 217, అక్టోబరులో 186 మంది చొప్పున ఇంజక్షన్ పొందారు. ఈనెల 15వ తేదీ వరకు 99 మందికి ఇంజెక్షన్ ఇచ్చినట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు వెల్లడించారు.
జిల్లాల వారీగా
గత ఏడాది జూన్ 1 నుంచి ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 617 మందికి స్టెమీ చికిత్స లభించింది. గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో ఈ సంఖ్య 124 వరకు ఉంది. దూర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి ఆసుపత్రికి వచ్చి అత్యవసర వైద్యం పొంది, ప్రాణాలు దక్కించుకున్నారు. విశాఖ జిల్లాలో 416, కర్నూలు-412, గుంటూరు-354, కాకినాడ-346, తిరుపతి-213, ఎన్టీఆర్-205, శ్రీకాకుళం-203, కడప-147, ఒంగోలు-134, నెల్లూరు జిల్లాల్లో 108 మందికి చొప్పున ‘స్టెమీ’ వైద్యం అందించినట్లు డీయస్ హెచ్ చక్రధర్ బాబు మంత్రి కి వివరించారు ..
ఫాలోఅప్ కూడా..
స్టెమీ విధానంలో చికిత్స పొందిన వారి గురించి 108 కాల్ సెంటర్ ద్వారా వారి ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు. వీరి వివరాలను ఇకపై ఎ ఎన్. ఎం.లు, సచివాలయాలకు పంపుబోతున్నామని అధికారులు మంత్రికి తెలిపారు .
రక్తం గడ్డను కరిగించినందున..
రక్త ప్రసరణ తగ్గి…. గుండె పోటుకు గురైన వారికి తక్షణ వైద్యం కింద స్టెమీ విధానంలో చికిత్స అందిస్తున్నారు. స్టెమీ చికిత్సలో భాగంగా టెనెక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ ద్వారా గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తున్నారు. దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ యథావిధిగా జరగడమే కాకుండా సకాలంలో పెద్దాసుపత్రుల్లో ఉన్నత వైద్యాన్ని పొందడంవల్ల బాధితులు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు.
‘యాప్’ ద్వారా కార్డియాలజిస్టులకు వివరాలు
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రు (238)ల్లో స్టెమీ విధానం అమల్లో ఉంది. ఈ ఆసుపత్రులకు గుండెనొప్పితో బాధపడుతూ వచ్చిన వారి ఆరోగ్య వివరాలను అక్కడి వైద్య సిబ్బంది తమ పరిధిలోని బోధనాసుపత్రుల్లోని కార్డియాలజీ విభాగానికి ‘స్టెమీ’ యాప్ ద్వారా (ఈసీజీ, ఇతర సమాచారాన్ని) పంపుతున్నారు. అక్కడి నిపుణులు వాటిని పరిశీలించి, ఇంజెక్షన్ ఇవ్వాలా? వద్దా? ఇంజెక్షన్ ఇస్తే తదుపరి చికిత్స ఎలా? ఏమీ చేయాలన్న దానిపై విలువైన సలహాలు, సూచనలు వైద్య సిబ్బందికి ఇస్తున్నారు. ఇంజెక్షన్ పొందిన అనంతరం రోగులు బోధనాసుత్రులు లేదా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని, ప్రైవేట్ అనుబంధ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.
