ఇరాన్ పై అమెరికా దాడులను ఖండిద్దాం

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం
సీపీఐ ఎంఎల్ ప్రకాశం జిల్లా కార్యదర్శి డి.వి.ఎన్.స్వామి
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా సామ్రాజ్యవాదులూ, జాత్యహంకార ఇజ్రాయెల్ పాలకులు ఇరాన్ అధ్యక్షుడ్ని హతమార్చడమే లక్ష్యంగా చేపట్టిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఐ ఎంఎల్ ప్రకాశం జిల్లా కార్యదర్శి డి.వి.ఎన్.స్వామి తెలిపారు. ఈ దాడుల్లో భాగంగా ఒక బాలికల పాఠశాల మీద జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 86 మంది బాలికలు సహా వందలాది సామాన్య ప్రజలు, ఇరాన్ అధ్యక్షుడు, ఆయన కుటుంబం ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపం ప్రకటిస్తున్నాం. ఎప్పటిలాగే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలున్నాయనే సాకును అమెరికా మళ్ళీ వల్లె వేస్తుంది. ఇరాన్ ప్రపంచ భద్రతకు ముప్పుగా మారిందని ట్రంప్ మాట్లాడుతున్నాడు. అణ్వాయుధాల నిర్మూలన కోసం, ప్రపంచ భద్రత కోసం ఏదైనా చర్యలు చేపట్టాలంటే ముందుగా మట్టుపెట్టాల్సింది పీకల్లోతున అణ్వాయుధాలలో కూరుకుపోయిన అమెరికా సామ్రాజ్యవాదాన్నీ, అమెరికా ప్రాపకంలో ప్రాంతీయ గూండాగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ జాత్యహంకారాన్నేననే విషయం ప్రపంచ ప్రజలందరికీ తెలిసిందే.

తమ దేశంలోని ఆయుధ వ్యాపారుల లాభాల కోసం, తమ ఆయిల్ దాహాన్ని తీర్చుకోవడానికి నిన్న వెనెజువెలా మీదా, నేడు ఇరాన్ మీదా అమెరికా ఇజ్రాయెల్ పాలకులు సాగిస్తున్న ఈ ప్రత్యక్ష దాడులను, ఇతర దేశాల పాలకులను నయానో భయానో లొంగదీసుకోవడాన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండించాల్సిన అవసరం ఉంది. తమ దోపిడికి సహకరించని దేశాల పాలకులను వ్యక్తిగతంగా నిర్మూలించడం ద్వారా ఇతర దేశాల ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనే వ్యూహంలో భాగంగా అమెరికా peace through strength పేరుతో అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద విధానాలను ప్రపంచ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
మధ్య ప్రాచ్యం లో, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేయడం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి ప్రపంచ ప్రజల రోజువారీ జీవితం మరింత అధ్వాన్నంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై ఆధారపడే మనదేశంలో శ్రామిక ప్రజల జీవితం దుర్భరం కానుంది. ఈ నరహంతక దాడులను వెంటనే నిలిపివేయాలని భారత ప్రజల తరపున అమెరికా ఇజ్రాయెల్ పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
