నేరడి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.

• అంతర్రాష్ట్ర అవరోధాలను అధిగమిస్తాం.
• శాసనమండలిలో జలరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
నేరడి, గుండ్రేవుల ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన అన్ని చర్యలూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శుక్రవారం శాసనమండలిలో ఈ రెండు ప్రాజెక్టుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల పూర్తికి అడ్డంకిగా ఉన్న కారణాలను అవరోధాలను, వాటిని అధిగమించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా లో వంశధార నది నుండి 34 టిఎంసిల నీటిని వినియోగించుకునేలా నేరడి బ్యారెజికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. నేరడి బ్యారేజికి సంబంధించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒడిశా రాష్ట్రంతో వివాదాన్ని పరిష్కరించేలా ఇటీవలే పలుమార్లు సిఎం చంద్రబాబు కేంద్రజలశక్తి మంత్రిని కలిసినట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. నెరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించడానికి వీలుగా, ట్రిబ్యునల్ తీర్పును త్వరగా అధికారిక గెజిట్లో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిని గౌరవ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు కోరినట్లు చెప్పారు.
అలాగే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు, కేసీ కెనాల్ కు, సాగు నీరందించేలా తుంగభద్ర నదిపై 20 టీఎంసీ ల నీటి నిల్వ సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ ప్రతి పాదించినట్లు పేర్కొన్నారు. ఇందుకు గత టీడీపీ ప్రభుత్వం రూ. రూ.2890 కోట్లతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమ్మతి తీసుకునేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. యువగళం పాదయాత్రలో ఈప్రాంత ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నారా లోకేష్ ఈప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ద పెట్టి పని చేస్తున్నారన్నారు.
రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ నాటి సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా గుండ్రేవులను గాలికొదిలేసారని మంత్రి విమర్శించారు. రాయలసీమ కు సాగు, తాగు నీరందించే ప్రాజెక్టులను రద్దుచేసి, జగన్ సీమ ద్రోహిగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారన్నారు. 2024 లో గుండ్రేవుల ప్రాజెక్టు అంచనా వ్యయం 4530 కోట్లకు చేరుకుందని నిమ్మల వివరించారు. అయినా ప్రాధాన్య క్రమంలో ఈ రెండిటినీ పూర్తి చేయటానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రామానాయుడు తెలిపారు.
