నేటి నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు
జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు సమావేశం
జీఎస్డీపీ, సూపర్ 6, తాగునీరు, గృహనిర్మాణం, జలధార,
జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్పై మొదటిరోజు చర్చ
2వ రోజు ఇ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్..
కేంద్ర నిధుల వినియోగంతో పాటు పలు అంశాలపై సమీక్ష
ఆంధ్రావని న్యూస్, అమరావతి : ఈనెల 10, 11న (సెప్టెంబర్ 2026)గురు, శుక్రవారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాధిపతులు పాల్గొననున్నారు. 7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల నివేదికతోనే మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక వృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడులు, శాంతిభద్రతలు లాంటి కీలక విభాగాల వారీగా సమీక్షించనున్నారు. అలాగే ప్రభుత్వ సేవలు, వివిధ పథకాల అమలు వంటి వాటిపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు.
రెండు రోజులు… 19 అంశాలు
మొదటి రోజున జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర విజన్కు జిల్లాస్థాయి రోడ్మ్యాప్లపై సమీక్షిస్తారు. అదే విధంగా సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్యా రంగంలో పురోగతి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సులో పలువురు కలెక్టర్లు ప్రదర్శిస్తారు. ఇక రెండో రోజు సదస్సులో ఇ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, జిల్లాల వారీ ర్యాంకింగ్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, శాంతిభద్రతలపై సమీక్షించి… అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారు.
