మూడు రోజుల పాటు వర్షాలు

విపత్తుల నిర్వహణశాఖ అంచనా
ఉపరితల ఆవర్తన ప్రభావంతో, గురువారం ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని వలన రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో చెట్లు క్రింద, భారీ హోర్డింగ్స్ వంటి వాటి వద్ద నిలబడరాదన్నారు. రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ వివరించారు.
గురువారం (10-09-2026) శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం (11-09-2026) మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందన్నారు.
శనివారం (12-09-2026) విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

